రూ. 27 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు.. భారీ జీతం కోతకు సిద్ధపడ్డ రిషబ్ పంత్.. సొంతగూటికే వెళ్ల‌నున్న స్టార్ ప్లేయ‌ర్‌!

  • ఐపీఎల్‌లో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం
  • లక్నో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్న రిషబ్ పంత్
  • రూ. 27 కోట్ల జీతాన్ని రూ. 15 కోట్లకు తగ్గించుకోనున్న పంత్
  • పంత్ బదులుగా లక్నో జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
  • లక్నో కెప్టెన్‌గా పంత్ విఫలమవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్, అనూహ్యంగా తన జీతంలో భారీ కోతకు అంగీకరించాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్టులో ఉన్న పంత్, ఆటగాళ్ల మార్పిడి (ట్రేడ్) పద్ధతిలో తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు తిరిగి వెళ్లనున్నాడు. ఈ మెగా డీల్‌లో భాగంగా, ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి మారనున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు లక్నో ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే, పంత్ కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. 2025 సీజన్‌లో 7వ స్థానంలో, 2026 సీజన్‌లో చివరిదైన 10వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం పంత్‌ను వదులుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ట్రేడ్ కోసం లక్నోతో చర్చలు జరిపింది. ఈ ఒప్పందంలో అత్యంత ఆసక్తికరమైన విషయం పంత్ తన జీతాన్ని తగ్గించుకోవడం. రూ. 27 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించడం ఢిల్లీకి సాధ్యం కాని నేపథ్యంలో పంత్ తన వేతనాన్ని సుమారు రూ. 15 కోట్లకు తగ్గించుకోవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇది అతని ప్రస్తుత జీతంలో సగం కంటే కొంచెం ఎక్కువ. మరోవైపు లక్నోకు మారనున్న కుల్దీప్ యాదవ్ జీతంలో (రూ. 13.25 కోట్లు) ఎలాంటి మార్పు ఉండబోదని నివేదిక పేర్కొంది.

ఈ ట్రేడ్ ఇద్దరు ఆటగాళ్లకు 'సొంతగూటికి చేరడం' లాంటిది. పంత్ గతంలో తొమ్మిది సీజన్ల పాటు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ ఇప్పుడు తన సొంత రాష్ట్ర ఫ్రాంచైజీ అయిన లక్నో తరఫున ఆడనున్నాడు. ఈ భారీ ట్రేడ్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Rishabh Pant
Delhi Capitals
Lucknow Super Giants
IPL Trade News
Kuldeep Yadav
IPL Player Salary

More Telugu News